ఢిల్లీ: కృష్ణాపురం ఉల్లి ఎగుమతికి అనుమతులు కల్పించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యసభలో జీరో అవర్లో ఎంపీ విజయసాయిరెడ్డి కేపీ ఉల్లి ఎగుమతి అంశాన్ని లేవనెత్తారు. కేపీ ఉల్లిని దేశీయంగా వంటకాల్లో వినియోగించరని, కేవలం ఎగుమతుల కోసమే రైతులు పండిస్తున్నారన్నారు. విదేశాల్లో కేపీ ఉల్లికి మంచి గిరాకీ ఉందని, ఇటీవల అసాధారణంగా పెరిగిన ఉల్లిధరల కారణంగా అన్ని రకాల ఉల్లిపాయల ఎక్స్పోర్ట్సుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందని గుర్తుచేశారు. దీంతో కేపీ ఉల్లిపాయాలపై తీవ్ర ప్రభావం పడిందని, తక్షణమే నిషేధం తొలగించి కేపీ ఉల్లిపాయల ఎగుమతులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వాణిజ్యశాఖకు ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. కేపీ ఉల్లి ఎగుమతికి అనుమతి ఇస్తామని, దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.