న్యూఢిల్లీ : శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్లలో జల విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పలు దఫాలుగా జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. రాజ్యసభలో సోమవారం వైయస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేఆర్ఎంబీకి ఇండెంట్ పెట్టకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్లలో తెలంగాణ ఏకపక్షంగా జల విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గత జూలై 5న జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.
శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయాలంటూ గత జూన్ 17న లేఖ ద్వారా తెలంగాణ జన్కోను ఆదేశించింది. జల విద్యుత్ ఉత్ప్తత్తి కోసం నీటి వినియోగంపై కేఆర్ఎంబీ తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు విద్యుత్ ఉత్పాదన చేయవద్దని ఆ లేఖలో సూచించినట్లు మంత్రి తెలిపారు. అయినప్పటికీ శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్తోపాటు నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్ల నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తూనే ఉన్నందున దీనిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ జూలై 15న కేఆర్ఎంబీ తెలంగాణ జెన్కో అధికారులను ఆదేశించింది. జల విద్యుత్ ఉత్పాదన కోసం వినియోగించే నీరు సాగు, తాగు నీటి అవసరాలకు మాత్రమే వినియోగించడానికి ఉభయ రాష్ట్రాలు అంగీకరించినందున కేవలం జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించడం తగదని కూడా కేఆర్ఎంబీ స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. కేఆర్ఎంబీ రాసిన లేఖలపై తెలంగాణ జెన్కో (హైడల్) డైరెక్టర్ జూలై 16న ప్రత్యుత్తరమిస్తూ జల విద్యుత్ ఉత్పాదన చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే తాము విద్యుత్ ఉత్పాదన చేస్తున్నట్లు కేఆర్ఎంబీకి తెలిపారని మంత్రి స్పష్టం చేశారు.
విద్యుత్ ఉత్పాదన కోసం నీటిని వినియోగించేందుకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసే వరకు శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్, నాగార్జున సాగర్ డామ్, పులిచింతల ప్రాజెక్ట్లలో విద్యుత్ ఉత్పాదన కోసం నీటి విడుదలను నిలిపివేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా కేఆర్ఎంబీ జూలై 16న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు జల శక్తి మంత్రి తెలిపారు. అయినప్పటికీ కేఆర్ఎంబీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కేఆర్ఎంబీకి కల్పించిన అధికారాలను సద్వినియోగం చేసే దిశగా కేఆర్ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. దీని వలన బోర్డు మరింత సమర్ధవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కు రబోధి బొగ్గు గనులు
విశాఖ స్టీల్ ప్లాంట్(ఆర్ఐఎన్ఎల్)కు జార్ఖండ్లోని రబోధి బొగ్గు గనులు కేటాయిస్తూ 2019లోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కోకింగ్ కోల్ లభించే రబోధి బొగ్గు గనిని ఆర్ఐఎన్ఎల్కు కేటాయిస్తున్నట్లుగా నామినేటెడ్ అథారిటీకి 2019 డిసెంబర్ 16న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఐఎన్ఎల్కు అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కూడా ఆ ఆదేశాలలో స్పష్టంగా కోరడం జరిగింది. ఆర్ఐఎన్ఎల్కు బొగ్గు గనులను కేటాయించాలని కోరుతూ బొగ్గు మంత్రిత్వ శాఖకు పలు దఫాలుగా విజ్ఞప్తులు వచ్చిన విషయం వాస్తవమే. ఆ విజ్ఞప్తుల మేరకే ఆర్ఐఎన్ఎల్కు రబోధి గనుల కేటాయింపు జరిగింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలలో కొన్నింటిని వ్యూహాత్మక విక్రయం చేయాలన్న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్ఐఎన్ఎల్లోని నూరు శాతం ప్రభుత్వ పెట్టుబడులను ఉపసహంరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
2022 మార్చి నాటికి సాలూరు బైపాస్ రోడ్డు పూర్తి...
రాయపూర్-విశాఖపట్నం సెక్షన్ జాతీయ రహదారి 26లో భాగంగా సాలూరు టౌన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణం 2022 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కోవిడ్ లాక్డౌన్ పరిస్థితుల కారణంగా బైపాస్ నిర్మాణం పనులలో జాప్యం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం 32 శాతం బైపాస్ పనులు జరిగాయని గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.