తాడేపల్లి: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో బాధితుల బాగోగులు చూస్తునే..పేదలకు సీఎం వైయస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని తన నివాసంలో నలందా ఎడ్యుకేషన్ సొసైటీ, వరప్రసాదరెడ్డి-విజయశారదారెడ్డి ఫౌండేషన్ సంయుక్త సహకారంతో మూడు వేలమంది పేదలకు నిత్యావసర వస్తువులు, పౌష్టికాహారం డోర్ డెలివరీ చేసేందుకు బయల్దేరుతున్న వాహనాన్ని విజయసాయిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనా వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ఇప్పటికే ఒక విడత బియ్యం, కంది పప్పు ఉచితంగా ఇచ్చారని, ప్రతి ఇంటికి రూ.1000 ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. రెండో విడత ఈ నెల 16వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తుందన్నారు. కరోనా నియంత్రణ ఉత్పత్తులకు ఏపీ వాణిజ్య హబ్ అవుతోందన్నారు. రైతులు తమ పంటను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వ్యవస్థకు వైయస్ జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా ఉత్పత్తులను వాల్ మార్ట్ ద్వారా ప్రపంచమంతా విక్రయిస్తామని కోతలు కోసిన పెద్ద మనిషి సిగ్గుపడేలా జనతా బజార్లు వస్తున్నాయన్నారు. పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.