టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా!
నెల్లూరు: తెలుగు దేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నాని వైయస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు నగరంలోని మూలపేట ప్రాంతంలో విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి.. ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారం చేసి మహిళలను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పెత్తందారులు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
నెల్లూరులోనే పుట్టి పెరిగిన పేదవాడైన ఖలీల్ అహ్మద్ కు సీఎం వైయస్ జగన్ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. పెత్తందారులు కావాలో లేదా మీతో కలిసి వుండే వాళ్ళు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎన్నికల తర్వాత నెల్లూరును విడిచి వెళ్తానని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత వేమిరెడ్డి, నారాయణలు వ్యాపారాలను చూసుకుంటారు. నేను నెల్లూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉంటా’ అని అన్నారు.
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ లు రౌడీలు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా. ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారు. బీజేపీతో జత కట్టడమే టీడీపీ చేసిన పెద్ద తప్పు. గతంలో కూడా చంద్రబాబు తప్పు అని చెప్పి మళ్ళీ వాళ్లతో కలిశారు. ముస్లింల రిజర్వేషన్లను వెనుక తీసుకుంటామని టీడీపీ, బీజేపీ పార్టీలు చెప్పాయని విజయసాయి రెడ్డి అన్నారు.