చంద్రబాబును అరెస్టు చేసి విచారించాలి
అమరావతి: చంద్రబాబు మాజీ పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయంటే చంద్రబాబు, లోకేష్, కోటరీ వద్ద లక్షల కోట్ల అక్రమాస్తులు ఉంటాయని, చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి విచారించాలని వైయస్ఆర్ సీపీ ఎంపీ నందిగం సురేష్ డిమాండ్ చేశారు. బాబు మాజీ పీఎస్ దగ్గర భారీ మొత్తంలో ఆస్తులు దొరకడం సామాన్య విషయం కాదన్నారు. ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిపై విచారణకు ఆదేశిస్తే లక్షల కోట్ల రూపాయలు బయటపడతాయన్నారు. చంద్రబాబు అవినీతిపై వైయస్ఆర్ సీపీ ‘అవినీతి చక్రవర్తి’ బుక్ కూడా రిలీజ్ చేసిందన్నారు. లోకేష్ గత ఐదేళ్లు వసూళ్ల కార్యక్రమంలోనే ఉన్నాడని, రాష్ట్రంలో దోచుకున్న సొమ్మంతా విదేశీ పర్యటన పేరుతో సింగపూర్కు వెళ్లి దాచుకున్నారని మండిపడ్డారు. బోగస్ కంపెనీలకు ఇక్కడి నుంచి డబ్బులు తరలించేందుకు చంద్రబాబు చాలా కీలకంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు, లోకేష్లపై విచారణ చేపడితే ఈ రాష్ట్రానికి అప్పులు ఉండవన్నారు.
బాబు మాజీ పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్ల ఆస్తులు ఉంటే.. చంద్రబాబు ఆస్తులు ఎంత ఉంటాయో ప్రజలు ఆలోచించాలని, రెండు ఎకరాల నుంచి రూ. లక్షల కోట్లు సంపాదించే స్థాయికి చంద్రబాబు వెళ్లాడని, అక్రమాస్తులపై లోతుగా దర్యాప్తు చేపట్టాలన్నారు. చంద్రబాబు, లోకేష్లను విచారణ చేస్తే వారి దగ్గర రూ. 2 నుంచి 3 లక్షల కోట్లు దొరుకుతాయని, గత ఐదేళ్లు మంత్రులుగా చేసిన వారిని విచారిస్తే ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల కోట్లు దొరికినా ఆశ్చర్యం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్, వారి కోటరీ పోటీ పడి రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆస్తులు సింగపూర్లో ఉన్నాయని, చంద్రబాబును వెంటనే అరెస్టు చేసి విచారణ చేయాల్సిన బాధ్యత ఐటీ శాఖపై ఉందన్నారు.