ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి
పార్వతిపురం; జిల్లాలో ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ ను వైయస్ఆర్సీపీ ఎంపీ గుమ్మ తనూజరాణి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ను ఎంపీ కలిసి పలు సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. ఏనుగులతో కోమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియమ్మవలస, బామిని సీతంపేట మండలాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఏనుగుల వల్ల ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరుగుతున్నాయని, సకాలంలో పంటలు కోయలేకపోతున్నారని వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో సుమారు రూ.1.50 కోట్ల ఎంపీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో బెలగాం రైల్వే గేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పరిసర గ్రామస్తుల ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.