తాడేపల్లి: నాలుగు నెలల పరిపాలన పూర్తికాకుండానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి 4 లక్షల ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం చూస్తే పండుగ వాతావరణం కనిపించిందని రాష్ట్ర ప్రభుత్వ శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సచివాలయ ఉద్యోగాల నియామకం పూర్తి కళ్లు మూసుకుపోయిన చంద్రబాబు లాంటి వారికి తెలియదేమో కానీ, పరిస్థితులు గమనిస్తున్న ప్రజలందరికీ తెలుసన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పిన ఘనత సీఎం వైయస్ జగన్కే దక్కిందన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజురీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదివిస్తే.. పదేళ్ల తరువాత ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ ఉద్యోగాలు ఇచ్చారని ఉద్యోగం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాలు సంతోషంగా పండుగ చేస్తుకుంటున్నాయని, ఇంతకంటే తృప్తి ఇంకేం కావాలన్నారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..
ముందుగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను మొదలుపెట్టి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించారు. ఒక విషయాన్ని సీఎం వైయస్ జగన్ స్పష్టంగా పదే పదే చెప్పారు. సేవాభావంతో ప్రజలతో మమేకం అయ్యి ప్రజల అవసరాలు తీర్చే ఒక వ్యవస్థ ఇది. ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి ఒక అవకాశం మీకు రావడం జీవితంలో ఇదొక మంచిపరిణామం అని సీఎం చెప్పారు.
1916 సంవత్సరంలో భారతీయుడికి సత్తా ఉంది. మా పరిపాలన మేము చేసుకోగలము అని గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వ ఉండగానే చెప్పారు. పరిపాలన అంటే పట్టణాల్లో, నగరాల్లో ఉండి చేసేది కాదు. గ్రామ స్థాయిలో పాలన చేసే సత్తా భారతీయులకు ఉందని ప్రకటించి బ్రిటీష్వారికి సవాలు చేశారు. చాలా మంది గ్రామ స్వరాజ్యంపై ప్రయత్నాలు చేశారు. రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు. దాంట్లో స్పష్టంగా 29 రకాల ప్రజలకు అందించాల్సిన సేవలను పంచాయతీలకు అప్పగించాలి. ప్రతి పంచాయతీ సంవత్సరానికి కనీసం రెండు సార్లు జనరల్ బాడీ మీటింగ్ జరిపించాలి. దీంట్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని స్పష్టంగా చెప్పారు. అయినా దేశంలో ఎవరూ అంత సహకరించలేదు. గ్రామీణ వ్యవస్థలో ఉన్న పంచాయతీలు, పట్టణాల్లోని మున్సిపాలిటీ వ్యవస్థ అధికారాలు బదిలీ చేయడంలేదు.
గత పాలకులు పాలనను గుప్పెట్లో పెట్టుకోవడానికి అలవాటు పడ్డారు. ప్రజల చేతుల్లో పెట్టి, ప్రజా ప్రతినిధుల చేతుల్లో పెట్టి సేవలు అందించాలనే ఆలోచన చేయలేదు. అందువల్లే గాంధీ నిర్వచించిన గ్రామ స్వరాజ్యం రానురాను మసకబారింది తప్ప రూపుదిద్దుకోలేదు. ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి వాటి స్థానంలో పార్టీ కార్యకర్తలను జన్మభూమి కమిటీల పేరుతో నియమించుకొని పాలన చేసిన దురదృష్టమైన పాలన గతంలో చూశాం. అటువంటి రోజులు పోయాయి.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేస్తున్న ప్రక్రియ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు అందించాలి, గాంధీజీ నిర్వచించిన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి. ఢిల్లీలో, రాష్ట్ర రాజధానిలో ఉన్నవారు పరిపాలకులు కాదు గ్రామీణ వ్యవస్థలో ఎన్నికైన వారు కూడా పరిపాలకులే అని చేసి చూపించారు. ఒకటి పార్లమెంట్ సచివాలయం, రెండు రాష్ట్రస్థాయి సచివాలయం, మూడోది వైయస్ జగన్ నెలకొల్పిన సచివాలయం. విమర్శించేవారంతా రాజ్యాంగ స్ఫూర్తిని చదువుకోండి. గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా నెలకొల్పాలో ఆలోచించి విమర్శలు చేస్తే బాగుంటుంది.
దాదాపు 2లక్షలకు పైగా వలంటీర్ల వ్యవస్థతో పాటు కేవలం 8 రోజుల్లో పరీక్షలు జరిపి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దాదాపు 1.35 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. గతంలో ఇంత భారీగా ఉద్యోగాలు భర్తీ చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు. అవినీతి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగాల నియామకం జరిగింది. ఇంతటితో ఉద్యోగాల విప్లవం ఆగిపోలేదు. ఇక నుంచి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి ఖాళీలు ఉన్న ప్రతి ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చెప్పారు. మంచి పనిని అభినందించాల్సింది పోయి కొందరు అవాకులు పేలుతున్నారు.
ఆఖరికి చంద్రబాబు ఎంత నీచస్థితికి దిగజారిపోయాడంటే.. ఉద్యోగాలు తీసేస్తున్నారని లెటర్లు రాశారు. నాలుగు నెలలు నిండకముందే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఉపాధి పీకేస్తున్నారని, గవర్నర్ దగ్గరకు వెళ్లి వినతులు ఇస్తున్నారని, రాయచోటిలో ఇలాంటి సంఘటనలు జరిగాయని కట్టుకథలు రాసుకునే వయస్సా మీది చంద్రబాబూ..? ఎందుకు ఇంత దిగజారిపోయారు. మంచిని ఎందుకు మంచి అనలేకపోతున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంద్రబాబును ప్రశ్నించారు.