అనంతపురం: రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోందని గుంతకల్ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం గుంతకల్ పట్టణంలో నూతనంగా మంజూరైన 589 పింఛన్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 43 నుంచి 44 లక్షల మందికే పింఛన్లు అందేవి. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవ్వా తాతలతో పాటు ఇతరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో పింఛనుదారులలో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. అమానవీయమైన ఈ విధానానికి సీఎం వైయస్ జగన్ స్వస్తి పలికారు. సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతోంది. పైగా, పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా లబ్ధిదారులు ఉన్న చోటుకే వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయి. ఇప్పటికే పింఛను అందుకుంటున్న వారితో పాటు కొత్త వారికి కూడా వలంటీర్లు వారున్న చోటుకే వెళ్లి డబ్బు పంపిణీ చేస్తారని చెప్పారు.