ప్రాణం ఉన్నంత వరకు సీఎం వైయ‌స్ జగన్‌ వెంటే

12 Apr, 2022 12:00 IST

అనంత‌పురం: మంత్రి పదవి రాలేదని తనకు అసంతృప్తి లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి తెలిపారు. సోమవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణం ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయ‌స్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్నదే తన ఆశయమన్నారు. మంత్రి పదవి దక్కక పోవడంతో తాను అసంతృప్తితో ఉన్నట్లు మీడియా అసత్యప్రచారం చేసిందన్నారు. తాను 40 ఏళ్ల నుంచి వైయ‌స్‌ కుటుంబం వెంటే ఉన్నానని పేర్కొన్నారు.

 
తనకు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 1999లో చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారన్నారు. ఆ తర్వాత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2014, 2019లో మడకశిర ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైయ‌స్సార్‌ కుటుంబానికి విశ్వాస పాత్రుడిగా ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దని కోరారు.