అమరావతి: వైద్యం, ప్రజారోగ్యం గురించి మాట్లాడాలంటే ముందుగా గుర్తుకు వచ్చే ఏకైక ముఖ్యమంత్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అన్నారు. 2004లో వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత 2007లో పైలెట్ ప్రాజెక్టుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచే ప్రారంభించారన్నారు. పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునేలా చేసిన నాయకుడు వైయస్ఆర్ అని కొనియాడారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చాయని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆరోగ్యశ్రీకి మళ్లీ ప్రాణం వచ్చిందని, మొట్టమొదటి బడ్జెట్లోనే మెడికల్ అండ్ హెల్త్కు రూ. 11,400 కోట్లు కేటాయించారన్నారు. రాష్ట్రంలో పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీకి ప్రాణం పోస్తూ వైద్యం వెయ్యి రూపాయలు దాటితే అది ఆరోగ్యశ్రీ కిందకు వర్తించేలా చేశారన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పట్టణాల్లో కూడా వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.