మంగళగిరి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాటలది కాదని..చేతల ప్రభుత్వమని నూతన పారిశ్రామిక పాలసీ తీసుకురావడంతో మరోసారి రుజువైందని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు నూతన పారిశ్రామిక పాలసీ ద్వారా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తామని, నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. కొత్త పాలసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉందన్నారు. పారిశ్రామిక రంగంలోనూ మహిళలకు సీఎం వైయస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మహిళలను ప్రోత్సహించే విధంగా కొత్త పాలసీ ఉందన్నారు. సీఎం వైయస్ జగన్ మహిళా పక్షపాతి అని కొనియాడారు. నీతి నిజాయితీతో కూడిన కొత్త పారిశ్రామిక పాలసీని ఈ రోజు ఆవిష్కరించామన్నారు. సీఎం వైయస్ జగన్తో పాటు యువ మంత్రి మేకపాటి గౌతంరెడ్డిలు యువతకు ఉపాధి కల్పించే విధంగా నూతన పాలసీపై ఎంతో కృషి చేశారని, ఈ నూతన పాలసీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా ఎమ్మెల్యే అయిన తనను ఏపీఐఐసీ చైర్పర్సన్ను చేయడమే కాకుండా, మహిళలకు పారిశ్రామికంగా ప్రోత్సహిస్తున్నందుకు సీఎం వైయస్ జగన్కు ఆర్కే రోజా కృతజ్ఞతలు తెలిపారు.