విజయవాడ: ఆదివాసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం నగరంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన ఆదివాసీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని తెలిపారు. గిరిజనులకు మొదటి కేబినెట్లోనే మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు.
గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారని తెలిపారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు..గిరిజనులకు నాలుగున్నరేళ్ల వరుకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 200 యూనిట్లు వరుకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్ కల్యాణ కానుక ద్వారా గిరిజన ఆడ పడుచులకు పెళ్ళి సమయంలో లక్ష రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.