తాడేపల్లి: కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నేనున్నానంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. అభినవ పూలేగా సీఎం వైయస్ జగన్ను అభివర్ణించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దాదాపు 4,500 మంది గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లి లాక్డౌన్లో చిక్కుకున్నారన్నారు. వారి కష్టాలను తెలుసుకున్న సీఎం వైయస్ జగన్ కేంద్ర మంత్రులు, గుజరాత్ సీఎంతో ప్రత్యేకంగా మాట్లాడి రాష్ట్రానికి రప్పించారన్నారు. వారి కోసం రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేసిన మనసున్న మారాజు సీఎం వైయస్ జగన్ అని కొనియాడారు. హైదరాబాద్లో దాక్కున్న చంద్రబాబు, ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. సీఎం వైయస్ జగన్ అవలంభిస్తున్న చర్యలు, కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. చంద్రబాబు దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టేందుకు మరో పోరాటం అంటూ పబ్లిసిటీ చేయించుకున్నారని, వైయస్ జగన్కు అలాంటి పబ్లిసిటీ పిచ్చి లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఇప్పటికే రూ.1000 ఆర్థికసాయం చేశారని, మూడు విడతల్లో ఉచితంగా రేషన్ ఇప్పించారని తెలిపారు.
లాక్డౌన్ నేపథ్యంలో కల్లు గీతా కార్మికుల కష్టాలను గమనించిన సీఎం వైయస్ జగన్ వారిని ఊరటినిచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. కల్లు గీతా కార్మికుల ఉపాధికి అనుమతిచ్చారని వివరించారు. నిత్యం అన్ని వర్గాల ప్రజల బాగోగులు పట్టించుకుంటున్న సీఎం వైయస్ జగన్పై ప్రతిపక్షాలు అవాక్కులు, చవాక్కులు పేల్చితే సహించేది లేదని జోగి రమేష్ హెచ్చరించారు.