శ్రీకాకుళం: మేకపాటి గౌతమ్రెడ్డి సమర్ధ మంత్రి అని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఇవాళ హఠాన్మరణం చెందిన పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డికి శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు నివాళి అర్పించారు. సమర్థనీయ ధోరణిలో పనిచేసి, అటు పార్టీలోనూ,ఇటు ప్రభుత్వంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు ఆ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందన్నారు. వైయస్ఆర్సీపీ ఆరంభం నుంచి ఉన్నత రీతిలో సేవలందించిన వ్యక్తి మేకపాటి గౌతం రెడ్డి అని కొనియాడారు.
మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం చాలా బాధ కలిగించింది. 51 సంవత్సరాల వయసు కలిగిన గౌతమ్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్ళుగా సమర్థవంతమైన మంత్రిగా పనిచేశారు. వారి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంపీగా సేవలు అందించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి పార్టీ, ప్రజల కోసం పనిచేసిన వారిలో మేకపాటి కుటుంబం ఒకటి. అలాంటి వ్యక్తి దూరమవ్వడం వారి కుటుంబ సభ్యులకే కాకుండా పార్టీకి, ప్రజలకు తీరని నష్టాన్ని చేకూర్చింది. ఈలోటు ఎవరూ పూడ్చలేనిది. గౌతమ్ రెడ్డి మంచి విద్యావంతుడు. రాజకీయాల్లో చురుకైన పాత్రను నిర్వహించి, ఇటు మంత్రివర్గంలో సైతం సమర్థవంత మంత్రిగా నిరూపించుకున్నారు. వ్యక్తిగతంగా నాతో ఎనలేని ప్రేమాభిమానాలు కలిగిన వ్యక్తి గౌతమ్ రెడ్డి. ఆయన హఠాన్మరణం చాలా ఆవేదనను కలిగించింది. వారి ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని ధర్మాన పేర్కొన్నారు.