తాడేపల్లి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ వైఖరీలను మంత్రులు తీవ్రంగా తప్పుపట్టారు. టీడీపీ కలవని, పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. ఎల్లోమీడియా నిత్యం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ నేతల మాటలు, వాడిన భాష రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు.
చంద్రబాబు, పవన్ తలదించుకునేలా రాజకీయాలు: మంత్రి గుమ్మనూరు
బాబు ఇచ్చే ప్యాకేజీకి పవన్ లాలూచీపడ్డారని మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. చంద్రబాబు, పవన్ తలదించుకునేలా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విమర్శలకు సమాధానం చెప్పలేని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. రాజకీయాల్లో ఓర్పు, సహనం అవసరమని హితవు పలికారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయింది: మంత్రి విడదల రజని
టీడీపీ హయాంలో ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి విడదల రజని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయిందని చెప్పారు. పవన్ వాడిన భాష దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు. విశాఖ గర్జన సక్సెస్ను డైవర్ట్ చేసేందుకు అలజడి సృష్టించారని పేర్కొన్నారు.
పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు: మంత్రి ఉషాశ్రీ చరణ్
పవన్ తన దత్తపుత్రుడు అని చంద్రబాబు రుజువు చేశాడని మంత్రి ఉషాశ్రీ చరణ్ వ్యాఖ్యానించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారని మండిపడ్డారు.