ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు అందిస్తున్నాం
నెల్లూరు: పేదలపై భారం పడకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు అందజేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నెల్లూరు భగత్సింగ్ నగర్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్లు టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేశారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,62,000 టిడ్కో ఇళ్లు సిద్ధం చేశామని, 18 నెలల్లో అన్ని చోట్లా టిడ్కో ఇళ్లు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పేదలపై భారం వేయాలని చూసిందని, కానీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు అందిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనా దక్షతకు టిడ్కో ఇళ్ల ఏర్పాటు నిదర్శనమన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం పేదల వద్ద డబ్బు కట్టించుకొని మోసం చేసిందని చెప్పారు. పేదలపై భారం పడకూడదనే రూ.7 వేల కోట్లను ప్రభుత్వం భరిస్తోందని వివరించారు.