కేంద్రమంత్రి మాండవీయతో మంత్రి విడదల రజిని భేటీ
ఢిల్లీ: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని భేటీ అయ్యారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో కేంద్రమంత్రి మాండవీయతో సమావేశమైన మంత్రి రజిని.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాల అనుమతుల విషయంపై చర్చించారు. ఎన్ఎంసీ కొత్త నిబంధనలను సడలించాలని కోరారు. ఎన్ఎంసీ కొత్త నిబంధనల వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందని వివరించారు. ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాల వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వైద్య కళాశాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. ఏపీలో రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని, ఇందులో ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. మంత్రి విడదల రజిని విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.