అమరావతి: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం బాధాకరమని, రాష్ట్రానికి తీరని లోటు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రోశయ్య సంతాప తీర్మాణ సభ గురువారం అసెంబ్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..రోశయ్య మరణం తెలుగు వారికి బాధాకరమన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల గవర్నర్గా పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఫైనాన్స్ మినిస్టర్గా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. తెలుగు తనం ఉట్టిపడే విధంగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు మంచి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ..కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులకు అసెంబ్లీ రూల్స్ తెలియడం లేదని, రోశయ్య మరణాన్ని కూడా రాజకీయం చేయడం, వారికి ఉన్న మీడియాతో దుష్ప్రచారం చేశారని, రోశయ్య మరణ వార్త తెలియగానే సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. రోశయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సిట్టింగ్ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి చనిపోతే కూడా శవ రాజకీయాలు చేశారని, సభలో ఒక విధంగా, బయట మరో రకంగా టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.