విజయవాడ: టీటీడీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తుందంటూ ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని దేవాదాయ వాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ భూములను అమ్మేందుకు కమిటీ కూడా వేశాడని, ఆ రోజున ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో టీటీడీ చైర్మన్గా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి, భానుప్రకాష్రెడ్డి సభ్యులుగా ఉన్నప్పుడే టీటీడీలో ఉపయోగం లేని భూములను వేలం వేసేలా కమిటీ వేశారని, గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఎల్లోమీడియాకు తప్పుగా కనిపించలేదా..? అని ప్రశ్నించారు. తన పాలనలో ఆలయాలను కూల్చివేసిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ వచ్చాక టీటీడీలో ఏదో జరుగుతోందని టీడీపీ, ఎల్లోమీడియా కలిసి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, టీటీడీ ఆస్తులు అమ్మితే సీఎం వైయస్ జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి ఒక్క రూపాయి కూడా రాదు. చంద్రబాబులా చీకటి జీఓలు ఇచ్చి అమ్మే ఆలోచన సీఎం వైయస్ జగన్కు లేదన్నారు. చంద్రబాబులా సదావర్తి భూములు దొంగచాటుగా వేలం వేయాలని నిర్ణయించలేదు. బాబులా దోచుకోవాలనే ఆలోచన సీఎం వైయస్ జగన్కు లేదన్నారు.
గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచిని సేకరిస్తాం.. చెడును ఉపేక్షించమని చెప్పారు. మేం పవన్ కల్యాణ్లా ఫాంహౌస్లో తాగిపడుకోవడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి రంజాన్ తోఫా ఎలా పంచుతారని కొందరు అంటున్నారని, మొదట తాను ఎమ్మెల్యేనని, ఆ తరువాతే మంత్రి అని, నియోజకవర్గంలోని అన్ని మతాల వారికి అండగా ఉంటానన్నారు. ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడన్నారు.
టీడీపీ ఐదేళ్ల పాలనపై, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ నేతలను మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే సీఎం వైయస్ జగన్ అవినీతిని తరిమికొట్టారని గుర్తుచేశారు. అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.