విజయవాడ: ప్యాకేజీ పెంచుకోవడానికే పవన్ కళ్యాణ్ ఇవాళ ఇప్పటంలో జనసేన సభ ఏర్పాటు చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఫ్లైట్లో ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లే ఆయనకు రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. విజయవాడలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఐపీఎల్ మ్యాచ్ల కోసం క్రీడాకారులకు వేలం పాట జరుగుతుందని, పవన్ కళ్యాణ్ కూడా సభ ద్వారా ఆయన రేటు పెంచుకుంటారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసమే జనసేన సభ అన్నారు. ఈ సభ వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదని, పవన్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదన్నారు.రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి ఆయన లేదన్నారు. నెలకు ఒక రోజు రాష్ట్రంలో పర్యటించే వ్యక్తిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.