ఏలూరు: ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ను తామంతా సమర్థిస్తున్నట్లు మంత్రి వనిత పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పెట్టిన భిక్ష అని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి దయతో, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సరైన భాష, వ్యవహరం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన సహజ లక్షణమని, అయితే రాఘురామకు అందులో ఒక్కటీ కూడా లేదని ఎద్దేవా చేశారు.
ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదని మంత్రి విమర్శించారు. ప్రజా సంక్షేమం వదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయడం సమంజసమన్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలని తానేటి వనిత హితవు పలికారు.