కేంద్ర నిధులు అడ్డుకోవాలనేదే ప్రతిపక్షాల కుట్ర
16 Mar, 2020 11:18 IST
అమరావతి: వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఎన్నికలు వాయిదా వేయించడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షాల కుట్ర అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అంతుపట్టని వైరస్ సోకిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయాలని రమేష్కుమార్ ఎలా నిర్ధారణకు వచ్చారని సురేష్ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు ఎవరెవరు చేతులు కలిపారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంతో చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని తెలిపారు.