అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..?
తాడేపల్లి: స్కిల్ స్కామ్లో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి అంటూ నారా బ్రహ్మిణి చేసిన ట్వీట్ను మంత్రి ఆర్కే రోజా తిప్పి కొట్టారు. అమ్మ బ్రహ్మిణి.. మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళితే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? మీ మామ మోసానికి, అవినీతికి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లోనే మోత మోగించి 23 సీట్లతో ఇంటికి పంపించారు. మీ భర్త నారా లోకేష్ కి మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? మీ మామ ఏమో అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ గారి పోరాటాన్ని కాపీ కొట్టి పల్లాలు, ప్లేట్లు, బెల్లులు కొట్టమంటున్నారు.. బావుంది. మీ ఫామిలీ ఫ్యామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? నీ మామ మీద ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారు.
బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ నారా చంద్రబాబు నాయుడు మీద చర్యలకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా బ్రహ్మిణి ? అంటే మీరు కోర్టులకంటే గొప్పోల్లా..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..? కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..? అంటూ మంత్రి రోజా ఎక్స్లో ట్వీట్ చేశారు.