విజయవాడ: అర్హులందరికీ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేలు అందజేస్తామని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు.సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన వాహన మిత్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నామన్నారు. గతేడాది అక్టోబర్లో ఈ పథకాన్ని సీఎం వైయస్ జగన్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఏడాది కూడా లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తామన్నారు. కొత్తగా ఎవరైనా ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసి ఉంటే ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాహనమిత్ర ఇంటికొకరికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఒకే ఇంట్లో ఒకరిపై ఆటో ఉండి, మరొకరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా ఈ పథకం వర్తిస్తుందన్నారు.
ప్రయాణాలకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది
ప్రయాణాలకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగానే ఉందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో స్టేట్ టాస్క్పోర్స్ సూచనలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్ సూచనలతో బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీలో ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కూడా తొలగించలేదన్నారు. ఉద్యోగుల తొలగింపు వార్తలు నిజం కాదని మంత్రి పేర్నినాని తేల్చి చెప్పారు.