తాడేపల్లి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం వైయస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపించారని సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆయన గుండె ధైర్యానికి జేజేలు పలకాల్సిందే అని, 54 వేల ఆర్టీసీ కుటుంబాల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్న ఆర్టీసీ కార్మికులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీని ఏపీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సుదీర్ఘ కాల కోర్కేను వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2020 జనవరి 1వ తేదీన నెరవేర్చబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల కలను సాకారం చేసే రోజు చరిత్రలో నిలిచిపోబోతోంది. జనవరి 1 నుంచి 50 వేల పైచిలుకు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మొదటి రోజు మొదలుకాబోతుంది. వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వైయస్ జగన్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా, ఓ సామాన్య పౌరుడిగా ఆర్టీసీని విలీనంచేసిన సీఎం వైయస్ జగన్ గుండెధైర్యానికి నిజంగా జేజేలు పలకాల్సిన పరిస్థితి. నాడు చంద్రబాబు ఆర్టీసీ విలీనం అసాధ్యమన్నారు. మీ కోర్కెలకు అంతు లేకుండా పోయిందని మాట్లాడారు. తన పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలు విన్న వైయస్ జగన్..అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీనిపరిరక్షించేందుకు ఉద్యోగులందరినీ కూడా మెర్జర్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆర్టీసీ విలీనంపై సీఎం వైయస్ జగన్ కంకణం కట్టుకుని ప్రయత్నాలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాట కోసం, ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా రూ.3600 కోట్ల జీత భత్యాల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం బుజానికి ఎత్తుకుంది. ఇలాంటి నిర్ణయం దేశ చరిత్రలో వైయస్ జగన్ ఒక్కరే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యంకాదని చాలా మంది నిపుణులు, మేధావులు అన్నప్పటికీ కూడా సీఎం వైయస్ జగన్ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లారు. 54 వేల ఆర్టీసీ కుటుంబాల తరఫున సీఎం వైయస్ జగన్కు పాదాభివందనాలు చేస్తున్నాను.