వంద రోజుల పాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం`
విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ శనివారం నుంచి వంద రోజుల జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. స్వచ్ఛాంధ్రపదేశ్ నినాదంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. చెత్త సేకరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 13 వేలకు పైగా ఉన్న పంచాయితీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టం ప్రవేశ పెడుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో 10 వేల మంది గ్రామ పంచాయితీ కార్మికులు పాల్గొంటారని తెలిపారు. కొత్తగా 4,171 చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నాం అని తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలంతా కలిసి రావాలి: బొత్స
క్లీన్ ఆంధ్రప్రదేశ్-క్లాప్ను సీఎం వైఎస్ జగన్ రేపు(శనివారం) ప్రారంభిస్తారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘‘ఉదయం పదిన్నరకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలంతా కలిసి రావాలి. పరిశుభ్రతలో తిరుపతి, విశాఖ, విజయవాడలకు అవార్డులు వచ్చాయి. శానిటేషన్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తడి, పొడి చెత్త సేకరణ కోసం ఇంటింటికి 3 డస్ట్బిన్లు ఇవ్వనున్నాం. పబ్లిసిటీపై కాదు.. పనులపైనే సీఎం జగన్ దృష్టి పెట్టారు. పూర్తిగా రాష్ట్ర నిధులతోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఏపీలో అమలు చేస్తోన్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.