చిత్తూరు: పంచాయతీ ఎన్నికల్లో వైయస్ జగన్ ప్రభంజనం స్పష్టమైందని.. వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు ఘన విజయాలు సాధిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మూడు, నాలుగో విడతల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచే దమ్ము, ధైర్యం టీడీపీకి లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సహా టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పుంగనూరు, తంబల్లపల్లి, మాచర్లలో ఎన్నికలు నిలిపేయాలని టీడీపీ నేతలు కోరడం సిగ్గు చేటని మంత్రి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోందని, చంద్రబాబు తానా అంటే కొన్ని ఛానల్స్, పత్రికలు తందానా అంటున్నాయని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబువి తప్పుడు లెక్కలని మంత్రి పెద్దిరెడ్డి కొట్టి పారేశారు.