ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ, చంద్రబాబు అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి
విజయవాడ: పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏంటని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో శాంతియుత, వాతావరణం నెలకొనాలి, ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలిన అని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పాలని ఆయన డిమాండు చేశారు. బుధవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏక గ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉంది? ఆ ప్రక్రియను తప్పుబట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదు? అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదు? అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏక గ్రీవాలు ఎక్కువ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడమే రాజకీయం కాదా?
అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారు. నామినేషన్లు వేయకముందే తాను ఎందుకు ప్రెస్మీట్లో దాని మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు?
పంచాయతీ ఎన్నికలనేవి పార్టీలకు అతీతంగా జరుగుతాయని, పార్టీల ప్రమేయం లేకుండా జరుగుతాయని, పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసినా కూడా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పలానా పార్టీకి అనుకూలంగానూ, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగానూ జరుగుతాయనే అభిప్రాయాన్ని కలిగించేలా మీడియా సమావేశంలో మాట్లాడటం ఎంతవరకు సమంజసం?
ఇంతకుముందు రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ మాదిరిగా ఇలా మాట్లాడారా? ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏనాడైనా తలెత్తిందా?
పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలంటూ... నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా? ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని ఆయన ఒక ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోంది.
పార్టీలకు సంబంధంలేని ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దురుద్దేశాలను అంటగట్టేలా మాట్లాడటం దేనికి నిదర్శనం?
ఏకగ్రీవ ఎన్నికలకు నజారానా ఇస్తూ, దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలను జీవోల ఆధారంగా స్పష్టంచేస్తూ ఐఅండ్పీఆర్ కమిషనర్ ఇచ్చిన ప్రకటనను తప్పుబట్టడం కూడా నిమ్మ గడ్డ రాజకీయాల్లో భాగంకాదా?
అధికారులతో ఎలాంటి సమస్యాలేదంటూనే.... తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ఏకంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవన్నట్టుగా, అసమర్థుడు అన్నట్టుగా కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా?
పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను తొలగించాలంటూ ముందు సీఎస్కు లేఖరాసి, తర్వాత లేదు అది నా ఉద్దేశం కాదంటూ మరో లేఖఅదేరోజు రాసి, మరుసటి రోజు వారిని అభిసంశిస్తూ మరో లేఖరాసి, ఈమేరకు డీఓపీటికి కూడా లేఖరాసి.. ఇవాళ మీడియా కాన్ఫరెన్స్లో తాను ఏమీ చేయలేదంటూ, కక్షసాధించలేదంటూ నిమ్మగడ్డగారు చెప్పుకోవడం... ఇది చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడల్లో భాగం కాదా?
వ్యవస్థలను సవ్యంగా, నిష్పక్షపాతంగా నడిపించాల్సిన వ్యక్తి ఇన్ని దురాగాతాలకు పాల్పడుతుంతే.. ఇక ఎన్నికల కమిషనర్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లిపోవా? అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.