సీఎం వైయస్ జగన్ చొరవతోనే మత్స్యకారుల విడుదల
తాడేపల్లి: పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేశారని, సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాంగ శాఖపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. గత టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కేవలం తూతూ మంత్రంగా లేఖలు రాసి వదిలేశాయన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ జల భాగంలోకి వెళ్లగా.. ఆ ప్రాంత కోస్ట్గార్డులు మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారని, వారిలో 15 మంది శ్రీకాకుళం జిల్లా, 5గురు విజయనగరం, ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా వాసులని చెప్పారు. 22 మందికి సంబంధించి ఆనాడు అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ తాత్కాలిక ప్రయత్నాలు మాత్రమే చేశాయన్నారు.
ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో బాధిత కుటుంబ సభ్యులు సమస్యను వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే స్పందించడం.. తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మత్స్యకారులను విడిపించేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధాని, అమిత్షా నోటీస్కు తీసుకువెళ్లారని, ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేపించారన్నారు. అమిత్షాకు 31–08–19న సీఎం వైయస్ జగన్ లేఖ రాశారని, ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం డిసెంబర్ 31న మత్స్యకారులను రిలీజ్ చేయడానికి అంగీకరిస్తూ విదేశాంగ శాఖకు సమాచారం పంపించిందన్నారు. సీఎం చొరవతో ఈ నెల 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు 20 మంది మత్స్యకారులు వాఘా సరిహద్దు ద్వారా భారతదేశంలోకి చేరుకుంటారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మరో నెల రోజుల్లో వస్తారని, 20 మందికి వైద్య పరీక్షలు చేసిన తరువాత వారి గ్రామాలకు పంపించడం జరుగుతుందన్నారు.
పాకిస్తాన్ జైల్లో ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు ప్రయత్నం చేస్తూనే.. జైల్లో ఉన్న 22 మంది మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం వైయస్ జగన్ ప్రతి నెలా ఒక్కో కుటుంబానికి రూ.4500 ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా లోన్లు ఇప్పించి అండగా నిలిచారన్నారు. సీఎం చొరవతో మత్స్యకారులు విడుదల అవుతున్నారన్నారు. దీంతో ఆ కుటుంబాలు, ఆ ప్రాంత ప్రజలు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. తమ వల్లే రిలీజ్ అవుతున్నట్లుగా అక్కడి ప్రాంత టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని, దీన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు.