సీఎం వైయస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం కొత్త ఇండస్ట్రియల్ పాలసీ
మంగళగిరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆలోచనల ప్రతిరూపం. ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించామని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా ఆవిష్కరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు.
ఎవరూ నష్టపోకుండా..
నూతన పారిశ్రామిక విధానం పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణమని.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై సమదృష్టి చూపనుందని మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నామన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుందని చెప్పారు. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉంటాయని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు.