నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంతిమయాత్ర ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ప్రాంగణానికి చేరుకుంది. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మ్రరిపాడు, బ్రహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరిలోని మెరిట్స్కు చేరుకుంది. స్వగ్రామం బ్రహ్మణపల్లిలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి భౌతికకాయానికి గ్రామస్థులు నివాళులర్పించారు. భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమయాత్ర సాగిన దాడిపొడవునా ప్రజలంతా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి జోహార్లు అర్పించారు. గౌతమన్నా అమర్ రహే అంటూ నినదించారు. తడిసిన గుండెలతో, తడారని కళ్లతో వీడ్కోలు పలికారు.
కాసేపట్లో మేకపాటి ఇంజినీరింగ్ కాలేజీ (మెరిట్స్) ప్రాంగణంలో మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు.