కాకినాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ ధాటికి తెలుగుదేశం పార్టీ పీఠం కదిలిపోయి.. జెండా పీకేయడానికి సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఏకపక్ష ఫలితాలను సీఎం వైయస్ జగన్కు ప్రజలు అందించారన్నారు. రాష్ట్రం మొత్తం వైయస్ఆర్ సీపీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతాడని తెలిసే చంద్రబాబు జెండా ఎత్తేశాడని ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు.
కాకినాడలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. నూతన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. మొన్నటి వరకు నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏరకంగా ప్రవర్తించారో రాష్ట్రమంతా చూసింది. ప్రజాస్వామ్యం ఉందో లేదో.. నిమ్మగడ్డ ఎన్నికలు ఆపేసినప్పుడే ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ఎన్నికలు ఎక్కడ ఆగిపోయాయో.. అక్కడి నుంచే మొదలుపెట్టాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని, కోర్టు ఆదేశాలనే నూతన కమిషనర్ ఫాలో అవుతున్నారన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబు తెలుసన్నారు. టీడీపీ ఒదిలేసింది కాబట్టే వైయస్ఆర్ సీపీ గెలిచిందని చెప్పుకోవడానికే బహిష్కరణ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో 37 శాతం గెలిచామని తోకపత్రికల్లో రాయించుకొని, లోకేష్ ప్రెస్మీట్లు చెప్పుకున్నప్పుడు.. పరిషత్ ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. 37 శాతం పంచాయతీలు గెలిస్తే.. 37 శాతం ఎంపీటీసీలు కూడా గెలుస్తారు కదా..అని చురకంటించారు.