విజయవాడ: పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభలో పవన్ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన డైలాగ్లు, స్క్రిప్ట్ను చదువుతున్నాడని మండిపడ్డారు. పూర్తి అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైయస్ వివేకానంద హత్య జరిగిందని.. ఆనాడు స్పందించని పవన్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే వైయస్ వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైందన్నారు. తండ్రి హత్య కేసుపై కుమార్తె సీబీఐని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటని ∙ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. విపక్షాలు మత విద్వేషాల ద్వారా లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నాయని, దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.