తాడేపల్లి: ఉచ్ఛం, నీచం లేని నాయకుడు చంద్రబాబు. తన డబ్బా కొట్టే మీడియా కోసం, దగ్గర ఉండే పది మంది ఇంటర్నేషనల్ బ్రోకర్ల కోసం మాత్రమే చంద్రబాబు పనిచేస్తాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై పిచ్చిరాతలు రాయిస్తున్నాడని మండిపడ్డారు. మతిస్థిమితం లేని వ్యక్తిగా చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. చేపల చెరువుకు.. వరి చేనుకు తేడా తెలియని బండరాయి లాంటి లోకేష్ను రాష్ట్రంపై విసరడాన్ని పిచ్చోడి చేతిలో రాయి కాదు.. చంద్రబాబు చేతిలో లోకేష్ అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వయస్సు వచ్చిందని బుద్ధితెచ్చుకొని ఇప్పటికైనా ఆఖరి రోజుల్లోనైనా పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు దొంగ నాటకాలు, నీచ రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలు దగ్గర నుంచే చూశారు కాబట్టే అతని కొడుకును మంగళగిరిలో ఓడించి, టీడీపీకి 23 సీట్లు కట్టబెట్టి నేలకేసి కొట్టారన్నారు.
‘నంద్యాలలో మైనార్టీ కుటుంబాన్ని దొంగ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారనే ఉద్దేశంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందన్న వార్త ముఖ్యమంత్రి వైయస్ జగన్ వినగానే.. ఆ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన సీఐని, కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి అరెస్టు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో ఓ కార్పొరేషన్ డైరెక్టర్గా, చంద్రబాబు ఇటీవల వేసిన రాష్ట్ర కమిటీలో సెక్రటరీ హోదాలో రామచంద్రరావు అనే వ్యక్తి పనిచేస్తున్నారు. టీడీపీ నేత రామచంద్రరావు అనే వ్యక్తి కోర్టులో నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ తీసుకువచ్చారు. ఏ కేసులు పడితే ఆ కేసులు వాదించే వారికి పదవులు ఇస్తారా..? అంతేకాకుండా వృత్తి వేరు, ప్రవృత్తి వేరు అని సిగ్గు, శరం లేకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.
మా పార్టీకి పెద్ద పెద్ద లాయర్లు లేరు, మా పార్టీకి చెందిన లాయర్లకు వాదించడం రాదు. అందుకే చిన్న కేసుల్లో కూడా మాకు బెయిల్స్ రావు. తెలుగుదేశం పార్టీ లాయర్లు విజ్ఞానవంతులు, లా తెలిసిన వారు కాబట్టి వీరి వాదన విని జడ్జిలు కన్వీన్స్ బెయిల్ ఇచ్చేస్తారు. టీడీపీ లాయర్ గట్టిగా వాదించే సరికి నిందితులకు బెయిల్ వచ్చింది. ఇది కూడా మా పొరపాటేనని చంద్రబాబు సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకొని చనిపోతే.. అందుకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తే.. నిందితులను సపోర్టు చేస్తూ వాళ్ల తరఫున పిటిషన్ వేయించి బెయిల్ ఇప్పిస్తారా..? ఇది కాదన్నట్లు ఆ బురద మా ప్రభుత్వంపై వేయడానికి సిగ్గు,శరం లేదా..? వయస్సు వచ్చినా బుద్ధిరాలేదా..?
చంద్రబాబు టిడ్కో ఇళ్ల గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కట్టించిన 13 లక్షల ఇళ్లలో 11 లక్షలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.1.50 లక్షల సబ్సిడీ, 13 లక్షల లబ్ధిదారుల దగ్గర రూ.1లక్ష చంద్రబాబు లాక్కొన్నాడు. అంతేకాకుండా లబ్ధిదారుల పేరు మీద రూ.3 లక్షల బ్యాంక్ లోన్ తీసుకొని కోట్ల రూపాయల డబ్బు వసూలు చేశాడు.
13 లక్షలకు 2 లక్షల ఇళ్లు మాత్రమే మొదలుపెట్టి.. ఆ డబ్బు కూడా కాంట్రాక్టర్లకు చెల్లించకుండా, ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక సదుపాయాల కల్పించకుండా 5 సంవత్సరాలు గాలి మాటలు చెప్పింది చంద్రబాబు.
ఈ రోజు సీఎం వైయస్ జగన్ 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఇస్తానంటే కోర్టుకు వెళ్లి గంటలకు రూ. కోట్ల ఫీజులు తీసుకునే లాయర్ల పెట్టుకొని రూ.25 కోట్లు ఖర్చు చేసి.. కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చాడు. గుంటనక్క బుద్ధి పోనివ్వకుండా కొంగజపం చేస్తున్నాడు.
చంద్రబాబుకు నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే కోర్టుకు వెళ్లి తెచ్చిన స్టే ఆర్డర్ను వెంటనే వెకేట్ చేయించాలని కోరుతున్నాను. డిసెంబర్ 21 మా నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు నాడు 30 ఇళ్ల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తాం. జనవరి వరకు ఆగాల్సిన అవసరం లేదు.
అధికారం కోసం కులాలు, మతాలను అడ్డుపెట్టుకునే సంస్కృతి చంద్రబాబుది. ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్టనష్టాలను చూస్తూ.. వారి కన్నీళ్లను తూడుస్తూ పార్టీని ముందుకు నడుస్తూ.. ప్రజల నుంచి అధికారంలోకి వచ్చిన నాయకుడు వైయస్ జగన్. పేదల కోసం, బడుగు, బలహీన, మైనార్టీ, గిరిజనుల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.