బాబు కోసం హెరిటేజ్ మూయరు..బాలయ్య సినిమా ఆపరు!
తాడేపల్లి: చంద్రబాబు కోసం హెరిటేజ్ మూయరు..బాలకృష్ణ రిలీజ్ ఆపరని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు మాత్రం చంద్రబాబు కోసం నిరసనలు చేయాలా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి నిలదీశారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించిందని ఆయన తెలిపారు. రాష్ట్రం అంతా రోడ్డెక్కాలని పిలుపు ఇస్తారు కానీ బాలయ్య, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంపాదన మాత్రం మానుకోరని కారుమూరి విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే తెలంగాణలో అల్లర్లేమిటి…?. ఆయనేమైన దేవుడా, దిగొచ్చాడా…? అంటూ మంత్రి ప్రశ్నించారు. ఇందిరాగాంధీ నుంచి దేశంలో పలువురు ప్రముఖులు అరెస్ట్ అయ్యారన్న కారుమూరి… వాళ్ళందరికంటే చంద్రబాబు గొప్పోడా అంటూ ప్రశ్నలు గుప్పించారు. దేశ చరిత్రలో జైలులో ఏసీ, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినది చంద్రబాబుకే అని తెలిపారు. చంద్రబాబు చేసిన పాపాలు ఊరికేపోవు.. చంద్రబాబు పాలనంతా స్కాములే.. చట్టానికి అందరూ సమానులే.. చంద్రబాబు పైనుంచి దిగిరాలేదని కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు.
పేదరికాన్ని 6శాతానికి తగ్గించిన ఘనత వైయస్ఆర్ సీపీదేనని…నీతి ఆయోగ్ లెక్కలే నిదర్శనమన్నారు. చంద్రబాబు పాలన స్కామ్ లైతే వైయస్ జగన్ పాలన స్కీంలు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభివర్ణించారు.