విశాఖ: గ్యాస్ లీకేజ్ ఘటన మృతిచెందిన చిన్నారి గ్రీష్మ తల్లిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కావాలనే ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఘటన బాధిత కుటుంబాలపై కేసులు నమోదు చేశారని ఓ వర్గం మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. 50 మందిపై పోలీసులు కేసులు పెట్టారన్న ప్రచారం కూడా అవాస్తవమేనని, దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, బాధితులను సీఎం వైయస్ జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారన్నారు.