కాకినాడ: 2014లో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు అబద్ధపు హామీలు గుప్పించి..తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేయడంతో టీడీపీని 2019 ఎన్నికల్లో 23 సీట్లకు అన్నదాతలు పరిమితం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రైతు సంక్షేమ పథకాలపై దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. రైతుల కోసం చంద్రబాబు చేసే పనుల్లో ఏనాడైనా చిత్తశుద్ధి ఉందా అని నిలదీశారు. టీడీపీ రైతు ఉద్యమం బూటకమని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. సోమవారం కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఆ రోజు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తామంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇది ఎవరికి సాధ్యం కాదని అప్పట్లో మాట్లాడారు. ఆ తరువాత తెలంగాణలో విద్యుత్ బిల్లులు కట్టలేదని రైతులకు సంకేళ్లు వేసి జీపుల్లో, వ్యాన్లలో పోలీసు స్టేషన్లు తరలించిన చరిత్ర చంద్రబాబుది. బషీర్బాగ్లో రైతుల మీద కాల్పులు జరిపించాడు. రైతుల ప్రాణాలు హరించిన చరిత్ర చంద్రబాబుది.
2014లో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నోన్నో హామీలు గుప్పించాడు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక రైతులకు ఏమాత్రం వెలగబెట్టాడో అందరూ చూశారు. ఆ రోజు ఏం చేశారు..కోటయ్య కమిటీ, కుటుంబ రావు కమిటీలు వేసి రూ.87 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి..కేవలం రూ.15 వేల కోట్ల రుణాలు మాఫీలు చేశారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు డ్రామా కంపెనీ తెరిచి..అన్నదాత సుఖీభవ అంటూ రైతులను మభ్యపెట్టే కార్యక్రమాలు చేశారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే 62 శాతం జనాభా ఈ రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడ్డారు.
2019లో టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి. రైతులకు మేలు చేసి ఉంటే 23 సీట్లు మాత్రమేనా వచ్చేది. మీకు చేతకాలేదు..రైతులను మోసం చేశారని, ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని మిమ్మల్ని రైతులు బజారుకిడ్చారు. మళ్లీ ఏదో జరిగిపోతుందని ఇవాళ కొత్తగా రైతు ఉద్యమాలకు పిలుపునిస్తారా?. టీడీపీ ఉద్యమ ఎజెండా చూస్తే విచిత్రంగా ఉంది. ఎండిపోయిన మొక్కజొన్న పంటలను, వాడిపోయిన పైర్లను పట్టుకొని ధర్నా చేయమని చంద్రబాబు పిలుపునిచ్చాడు. హైదరాబాద్లో తండ్రీకొడుకులు కాపురం ఉంటూ..రాష్ట్రంలో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు. వారం ఓ కార్యక్రమం చేయాలి కాబట్టి..రాక్షసుడికి పుట్టెడు అన్నం పంపించాలన్న నిబంధనల మేరకు వారానికో ఏజెండాతో రాష్ట్రంలోకి వస్తున్నారు.
ఇవాళ రాష్ట్రంలో 40 శాతం అధిక వర్షపాతం నమోదు అయితే..పంటలు ఎండిపోవడం ఏంటో మహాప్రభూ అని అడుగుతున్నాం. రిజర్వాయర్లు అన్నీ నిండి కళకళలాడుతున్నాయి. గోదావరి, కృష్ణా ఒకసారి చూడండి. ఏవిధంగా సముద్రంలోకి నీళ్లు వెళ్తున్నాయో కనిపిస్తుంది. రైతు బాంధవుడినని చెప్పుకునే హక్కు చంద్రబాబుకు లేదు. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరూ? డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి. ఈ ప్రాజెక్టును విభజన సమయంలో తెచ్చుకుంటే..ఆ వర్కులు మేమే చేస్తామని చంద్రబాబు తెచ్చుకొని..చివరకు ఏం చేశారు. ప్రధాన మంత్రి స్వయంగా రాష్ట్రానికి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారింది. ఎప్పుడు కావాల్సిస్తే అప్పుడు దాన్ని పిండుకుంటున్నారని నరేంద్రమోదీ సర్టిఫికెట్ ఇచ్చారు.
రైతు బాంధవుడిని..రైతులకు ఎన్నో చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు..యూనైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తును పెంచుతుంటే ఏం చేశారు..గోళ్లు గిళ్లుకున్నారా? కన్వీనర్ మోదాలో అడ్డుకోలేని చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడొచ్చి సీఎం వైయస్ జగన్పై బురద జల్లేందుకు రైతు ఒక ఎజెండాగా దొరికాడు. పైగా అవాక్కులు, చవాక్కులు మాట్లాడుతున్నాడు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు హంద్రీనీవాకు ఖర్చు చేసింది ఎంత?. ఏ రోజైనా రాయలసీమ దాహర్తి గురించి, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేసిన ఫేసా ఆయనది. ఒక్క రోజైనా ఆలోచన చేశారు. ఈ రాష్ట్రంలో ఫలాని ప్రాజెక్టు మేం టేకాఫ్ చేశాం. మేమే పూర్తి చేశామని గుండెలమీద చెయ్యి వేసుకొని చెప్పగలరా?
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తుంటే..దీనికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో లేఖలు రాయించిన చరిత్ర చంద్రబాబుది. ఈ మధ్యనే ఒక రిపోర్టు కూడా వచ్చింది. 2018 నాటికి అత్యధిక అప్పులు ఉన్న రైతాంగంగా ఈ రాష్ట్రం నిలబడాల్చిన ఖర్మ వచ్చింది.
ఈ రోజు మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది అక్షరాల చేసి చూపిస్తున్నాం. నవరత్నాల పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారు. వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన పథకం మొదలు వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాలు ప్రవేశపెట్టి ముందుకు వెళ్తుంటే కళ్లు కుట్టి ఇక్కడ ఏమీ జరగట్లేదని గ్లోబెల్ ప్రచారం చేసుకుంటూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీనికోసం పెద్ద కార్యాచరణ, కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఇవాళ దేశం మొత్తంమన వైపు చూస్తోంది. ప్రతి గ్రామంలోనే ఒక వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ సహాయకుడు, అనిమల్ హాస్పెండరీ వంటి ప్రభుత్వ ఉద్యోగులను నియమించాం. ప్రతి ఆర్బీకేలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ..వాటిని విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దాం. ప్రతి ఆర్బీకేను కొనుగోలు కేంద్రంగా ప్రకటించాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేశాం. మీరు కలలో కూడా ఊహించని సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయి.
మీరు ఏ రోజైనా కొబ్బరి రైతుల గురించి ఆలోచన చేశారా? . కొబ్బరి ధర పడిపోతే మీ హయాంలో ఆదుకోవాలని అనుకున్నారా? జీడీ మామిడికి మద్దతు ధర ప్రకటించింది సీఎం వైయస్ జగన్ కాదా?. కనీస మద్దతు ధరలు ప్రకటించిన విషయం మీకు తెలుసా?. పొగాకు రైతులు నష్టపోతుంటే..ప్రభుత్వమే మార్కెట్లోకి ఎంట్రీ అయి కొనుగోలు చేసింది మీకు తెలుసా? కేవలం ఈ–క్రాప్ బుక్ చేసుకుంటే..వైయస్ఆర్ ఉచిత పంటల బీమా అమలవుతుందని మీకు తెలుసా? ఇవేవి తెలుసుకోకుండా తగునమ్మా అంటూ రోడ్లపైకి వచ్చి సొంత మీడియా మద్దతు ఉందని బహుబలిగా చలామణి అవుతున్నారు. రైతుల గురించి మీరా మాట్లాడేది. దయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉంది. చంద్రబాబును చూస్తే 70 ఏళ్ల అబద్ధం నడిచి వచ్చినట్లుగా ఉంది. పచ్చి అబద్ధాలు..ఒక్క రోజైనా నిజాలు మాట్లాడని చంద్రబాబును ఏమని అర్థం చేసుకోవాలి.
టీడీపీ హయాంలో ఇన్ఫుట్ సబ్సిడీ కోసం ఎంత బకాయిలు పెట్టారో మీకు అవగాహన ఉందా?. రూ.1400 కోట్లు ఇన్ఫుట్ సబ్సిడీ బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం వైయస్ జగన్ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం అందించాలనే ఒక విధానం తీసుకువచ్చి..గతేడాది సంబంధించిన తుపాన్లు, వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరిహారం తక్షణమే అందించిన విషయం మీకు తెలుసా?
ఇవాళ ఎవరి వద్దకు వెళ్లి రైతులు మాకు ఈ పని చేయండని చేయి చాపాల్సిన అవసరం లేకుండా..నేరుగా రైతుల ఖాతాలకే సీఎం వైయస్ జగన్ బటన్ నొక్కి ప్రోత్సహిస్తున్నది మీకు తెలియదా? పచ్చ బ్యాచ్కు పచ్చ కామెర్లు వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. ఈ రోజు కూడా క్షేత్రస్థాయిలో ఆర్బీకేలను తానే పరిశీలించి వచ్చాను. ఎరువుల ధరలు పెరిగినట్లు మాట్లాడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎరువుల సబ్సిడీలు కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్రంలో డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సరిపడ ఉన్నాయి. సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు బఫర్ స్టాక్ మెయింటెన్ చేస్తున్నామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.