వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు
నెల్లూరు: టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని, యువగళానికి స్పందనే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఏ పంట ఎక్కడ పండుతుందో కనీస పరిజ్ఞానం లేని లోకేష్ కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. టీడీపీ హయాంలో సాగు, తాగునీరు లేదని, చంద్రబాబు అధికారంలోకి ఉంటే కరువు కటకాలు విలయతాండవం చేస్తాయన్నారు. బాబు హయాంలో ప్రతి ఏటా కరువు మండలాలు ప్రకటించారని గుర్తుచేశారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సోమశిల లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తామని చెబుతున్న లోకేష్.. చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. రైతు రథం పేరుతో కమీషన్లు కొల్లగొట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. అప్పటి మంత్రి సోమిరెడ్డి మిల్లర్ల నుంచి ముడుపులు దండుకున్నాడని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో విత్తనాల కోసం క్యూలో నిలబడి రైతులు చనిపోయారన్నారు.
వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు, టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ హయాంలో ఆర్బీకేలను ఎందుకు తీసుకురాలేదని మంత్రి కాకాణి ప్రశ్నించారు. ఉద్యానవన పంటల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. దీన్ని మర్చిపోయి లోకేష్ మాట్లాడుతున్నాడన్నారు. టీడీపీ హయాంలో నకిలీ విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారని, రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసింది లోకేష్కు గుర్తుకు లేదా..? అని ప్రశ్నించారు.