విజయవాడ: మొన్న కందుకూరు, నిన్న గుంటూరులో చంద్రబాబు సభల్లో చోటుచేసుకున్న మరణాలన్నీ చంద్రబాబు చేస్తున్న హత్యలేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్న చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో టీడీపీ సభలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఫొటోషూట్లు, డ్రోన్ షాట్ల పేరుతో చంద్రబాబు పేద ప్రజల ఉసురు తీస్తున్నాడని మండిపడ్డారు. నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలితీసుకున్నాడని, గుంటూరులో కానుక పేరుతో హడావిడి చేసి ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడని ధ్వజమెత్తారు. ఇరుకు సందుల్లో సభ పెట్టి జనం తన కోసం వస్తున్నారని పబ్లిసిటీ చేసుకోవడం కోసమే అమాయక ప్రజలను బలితీసుకుంటున్నాడని దుయ్యబట్టారు.
కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారి కుటుంబంలో చంద్రబాబు విషాదాన్ని మిగిల్చాడని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. చంద్రబాబు మీటింగ్లకు ఎక్కడా పర్మిషన్లు ఇవ్వొద్దని డీజీపీని కోరతానని చెప్పారు. 30 వేల మందికి టోకెన్లు పంచి.. మూడు వేల మందికి కూడా ఏర్పాట్లు చేయలేదని, చంద్రబాబు అధికార దాహానికి అమాయక జనం బలైపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుని రాష్ట్రంలో తిరగనిస్తే మరింత మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటాడన్నారు.