తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. కోరమండల్లో 309 మంది, యశ్వంత్పూర్ రైలులో 33 మంది ఏపీకి చెందిన వారు ఉన్నారని, రెండు రైళ్లలో 342 మంది ప్రయాణించినట్లు గుర్తించామన్నారు.వీరిలో 12 మందికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. విశాఖ ఆసుపత్రిలో నలుగురికి చికిత్సలు అందిస్తున్నామని, గురుమూర్తి అనే వ్యక్తి తప్ప ఎవరూ మరణించలేదని, అందరూ క్షేమంగానే ఉన్నారని మంత్రి తెలిపారు. రైలు ప్రమాదంపై ఇతర రాష్ట్రాల కంటే చొరవగా ఏపీ ప్రభుత్వం పని చేసిందన్నారు. ఈ ప్రమాదాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం సరికాదని హితవు పలికారు. రైల్వే డిపార్టుమెంట్ కేంద్రం పరిధిలో ఉంటుందని, బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత ఇవ్వాలన్నది వారి పరిధిలోనే ఉంటుందన్నారు. రాష్ట్రానికి సంబంధించి సీఎం వైయస్ జగన్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు.