ఈనెల 26న న్యూ ఇండస్ట్రీయల్ పాలసీ ఖరారు
అమరావతి: అవినీతికి ఆస్కారం లేకుండా పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్నారు. ఈ నెల 26న నూతన పారిశ్రామిక విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి నేతృత్వంలో ఇండస్ట్రియల్ టాస్క్ఫోర్స్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక పాలసీపై చర్చించారు. నాలుగు రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా పాలసీ రూపొందిస్తామని, పరిశ్రమలకు స్థలం, వాటర్, పవర్, స్కిల్ మ్యాన్ పవర్ కూడా అందిస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక పాలసీని తీసుకురానున్నామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాలతో పాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి వైయస్ జగన్ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు.