జీవన ప్రమాణాల పెంపుదలకు కృషి
శ్రీకాకుళం: ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక డీసీసీబీ కాలనీలో రూ.1.8 కోట్లతో నిర్మించిన వైయస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. పార్క్ కోసం 20 లక్షల రూపాయలు, చిల్డ్రన్ పార్క్ కోసం 15 లక్షల రూపాయలు, రోడ్డు ఎత్తు చేసేందుకు 20 లక్షల రూపాయలు,రోడ్డు విస్తరణ కోసం 22 లక్షల రూపాయలు, ఇందు బ్యూటీ పార్లర్ రోడ్డుకు 20 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ పనులన్నింటినీ ఎన్నికల ముందే పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..ప్రాథమిక చికిత్స కోసం అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. వైద్య రంగానికి సంబంధించి,బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేశాం. సాధారణ కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవ్వకుండా ప్రభుత్వం తోడుగా ఉంటోంది. అలానే అర్బన్ హెల్త్ సెంటర్లలో అనుభవజ్ఞులయిన వైద్యులను అందుబాటులో ఉంచాము. స్థానికులు కలిసి కట్టుగా ఉంటూ..ప్రభుత్వ నిర్మాణాలను కాపాడుకోవాలి. ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద అక్రమంగా కేసు నమోదు చేశామని కొన్ని ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే తేల్చాయి ఆ రోజు జీఎస్టీ ఎగొట్టారని..డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ కం ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి సీమెస్ సంస్థను కోరగా మాకు అలాంటి ఏవి రాలేదు అని సంబంధిత ప్రతినిధులు చెప్పారు. చంద్రబాబు కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు దోచుకున్నారు. అలానే చంద్రబాబు పీఏ,లోకేశ్ పీఏ ఇవాళ పరారీలో ఉన్నారు. అమెరికాకు వాళ్లిద్దరూ పారిపోయారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా కేసులు నమోదు చేశాయి. తప్పు చేస్తే చట్టం ఎవరిని వదలదు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు, అలానే జయలలిత,లాలూ ప్రసాద్ యాదవ్ ఇలా చాలా మంది కోర్టుల ముందు ఉన్నారు.
చంద్రబాబు ఏమయినా దిగి వచ్చారా..? ఇవాళ ధరలు దేశంలో అన్ని చోట్లా పెరిగాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. అవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించేందకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. మరో మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. బిల్డింగ్స్ కడితే అభివృద్ధి కాదు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అసలైన అభివృద్ధి. ఇవాళ విద్యా రంగం లో అనేక మార్పులు తీసుకు వచ్చాం. ఇవే మార్పులు కొనసాగిస్తే.. రానున్న 20 ఏళ్ళలో మన విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీ లో విజేతలయి ఉంటారు. అవినీతి పూర్తిగా ప్రక్షాళన చేశాము.

ఒకనాడు ప్రధాని రాజీవ్ గాంధీ ఆవేదన చెందారు. సంక్షేమాని కి కేటాయించే నిధులలో 90 శాతం అర్హులకు చేరడం లేదని అన్నారు. మధ్యవర్తుల దగ్గరే సొమ్మంతా ఉండిపోతుందని బాధపడ్డారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది. పరిపాలనను వార్డు, గ్రామ స్థాయికి తీసుకు వచ్చాము.రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది.
వందేళ్ల తరువాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం దిద్దాం. మన రాష్ట్రంలో, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించి సర్వే చేపట్టాం. భూతగాదాలు లేకుండా గ్రామాల్లో శాంతియుత వాతావరణ నెలకొల్పాం. ఇదంతా నాలుగున్నరేళ్ల క్రితం మీరు ఎన్నుకున్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయ్యింది.
అలానే జిల్లా కేంద్రంలో ఉన్న కేఆర్ స్టేడియం నిర్మాణం కోసం,12 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. ఆ రోజు జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఈ నిధులు మంజూరు అయ్యాయి. సంపూర్ణ స్థాయిలో పనులు పూర్తి చేసి త్వరలో స్టేడియంను ప్రారంభిస్తాం. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.
మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, మెంటాడ పద్మావతి, పట్టణ వైయస్ఆర్సీపీ అధ్యక్షులు సాదు వైకుంఠ రావు, బలగ గణపతి పట్నాయక్, హెల్త్ సెంటర్ చైర్మన్ రాజేంద్ర కుమార్, అల్లు లక్ష్మి నారాయణ, డాక్టర్ పైడి మహేశ్వర రావు, కొండల గణేష్, ఉన్నా నాగరాజు, హారిక ప్రసాద్, తెలుగు రమేష్, బరాటం సంతోష్, రూప్ప గిరి తదితరులు పాల్గొన్నారు.