న్యూఢిల్లీ: త్వరలోనే ఓర్వకల్లు ఎయిర్పోర్టును ప్రారంభిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. భోగాపురం ఎయిర్ పోర్టులో షిప్టింగ్, టెక్నికల్ అంశాలపై బుగ్గన చర్చించారు. అన్ని అంశాలపై హర్దీప్ సింగ్ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని చెప్పారు. సివిల్ ఏవియేషన్కు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కూడా త్వరలోనే జరుగుతుందని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కమర్శియల్ ఆపరేషన్కు సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటం, ఆత్రుత, అసమర్ధతతో పని చేసిందన్నారు. ప్రచారాలు చేసుకునే ప్రభుత్వం మాది కాదని స్పష్టం చేశారు. శంకుస్థాపనల కోసం కాకుండా ప్రారంభోత్సవాలు చేయడం లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు.