ఏపీ సచివాలయం: కియా పరిశ్రమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మండిపడ్డారు. ఓర్వేలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏపీ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారని ఫైర్ అయ్యారు. కియా పరిశ్రమ తరలిపోతుందంటూ వచ్చిన కథనాలను మంత్రి తీవ్రంగా ఖండించారు.కియా పరిశ్రమ ఎక్కడికి తరలిపోవడం లేదని, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు త్వరలోనే రాబోతున్నాయని చెప్పారు. ఏపీ సచివాలయంలో గురువారం మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిశ్రమల శాఖలో పురోగతి సాధించింది. కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.పరిశ్రమ తరలిపోతోందన్న కథనాలను కియా నిర్వాహకులే ఖండించారు. ఇటీవల సీఎం వైయస్ జగన్ కియా పరిశ్రమ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పరిశ్రమ ఎండీతో పాటు కొరియా అంబాసిడర్ కూడా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకానికి సంతోషపడ్డారు. రోడ్డుపై అండర్ బ్రిడ్జి కావాలని కియా పరిశ్రమ కోరడంతో సీఎం వైయస్ జగన్ వెంటనే అంగీకరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందిస్తామని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు. కియా ఆపరేషన్ హెడ్ పార్క్ సంతోషం వ్యక్తం చేశారు. 2008లో తాను రిసెర్చ్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కియా పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పట్లో కోరినట్లు పార్క్ సీఎం వైయస్ జగన్కు లేఖ కూడా రాశారు. రూ.14 వేల కోట్ల పెట్టుబడులతో కియా ప్లాంట్ పెట్టారు. కియా కార్లు బ్రహ్మండంగా తయారై మార్కెట్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్దేశపూర్వకంగా కియా పరిశ్రమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో కూడా జరుగుతోంది. ఓర్వలేక ఇటువంటి దుష్ప్రచారానికి ఒడిగట్టారు. రాష్ట్రంలో బిర్లా, ఏటీసీ టైర్స్, స్మార్ట్టెక్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు త్వరలోనే ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఏపీలో పరిశ్రమల పెట్టుబడులకు అన్ని సౌకర్యాలు కల్పించాం.
కాండ్యూయంట్ అనే కంపెనీ వైజాగ్లోని మిలినీయం టవర్స్లో ఉన్న ఆఫీస్ను షిప్ట్ చేయమన్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ఇది వందశాతం తప్పే. మీడియా, సోషల్ మీడియాను వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. 2014-2019 వరకు పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు రూ.3,500 కోట్లు టీడీపీ ప్రభుత్వం బకాయిలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి చంద్రబాబు కాదా కారణం?. చంద్రబాబు దిగిపోతూ దాదాపు రూ.38 వేల కోట్ల పనులు, సీఆర్డీఏ లెక్కేసుకుంటే లక్ష కోట్ల పనులకు డీపీఆర్లు లేకుండా టెండర్లను పిలిచారు. దాదాపు రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టారు. సూదికి, దూదికి పెండింగ్ పెట్టారు. ఆ బకాయిలు అన్నీ కూడా మేమే కట్టాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ బకాయిలు డిసెంబర్ వరకు క్లియర్ చేశాం. పవర్ సప్లయ్ పేరు మీద విచ్చల విడిగా అప్పులు చేసి పసుపు కుంకుమ అని ఎన్నికల్లో ఖర్చులు చేశారు. ఆ అప్పులు ఎవరు తీర్చాలి. రాబడి రావడం లేదని చంద్రబాబు అంటున్నారు. డిసెంబర్ 15 వరకు లెక్కలెస్తే..రూ.15,214 వ్యాట్, జీఎస్టీలో రావాల్సిన భాగం. మా ప్రభుత్వం 975 కోట్లు ఎక్కువగా పన్నులు వసూలు చేశాం. గతేడాది 6.8 శాతం పన్నుల వసూలు పెరిగింది. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది కాబట్టి రాష్ట్రంలో తగ్గింది. రెవెన్యూ కలెక్షన్లు పరిశీలిస్తే..గతేడాది రూ.28,800 కోట్లు వసూలు చేశాం. రెండుశాతం ఎక్కువగా చేశాం. దేశవ్యాప్తంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. టీడీపీ వాళ్లు అప్పులు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేసి వెళ్లారు. చంద్రబాబులా మేం అనవసర ప్రచారం చేసుకోవడం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వివరించారు.