అమరావతి: సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ యధేచ్ఛగా జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుకను దోచేయడంతో లభ్యత తక్కువగా ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులపై గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు దాడులు చేశారని తెలిపారు. గతంలో స్టాక్ పెట్టాల్సిన స్థానంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఇసుక వేలంలో కొంత అంతరాయం ఏర్పడిందని, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎవరైనా బోనఫైడ్ బిల్డర్, సొంత ఇళ్లు, ప్రభుత్వ భవనాలు కట్టేవారు తహశీల్దార్ వద్దకు వెళ్తే బోనఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. వచ్చే నెల నుంచి సిస్టమాటిక్గా, పద్ధతిగా ఇసుకను సరఫరా చేస్తామని సమాధానం చెప్పారు.అన్ని విధాల ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు.