విశాఖపట్నం: గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్ లీకేజీ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, విశాఖలోని పరిస్థితులపై సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ సాధారణ పరిస్థితులు నెలకొల్పామని, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న బాధితులకు సీఎం వైయస్ జగన్ ప్రకటించిన విధంగా పరిహారం కూడా అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ విధమైన ఆరోగ్య సమస్య వచ్చినా పూర్తిగా బాధ్యత వహించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు.. జూమ్ పార్టీ అయిపోయిందని, ప్రజల దగ్గరకు రారు.. ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లరు. కరోనా వచ్చిన ప్రాంతాల ప్రజలకు సాయపడరు కానీ, జూమ్ యాప్లో విమర్శించుకుంటూ జూమ్ పార్టీగా తయారైందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి బొత్స విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
‘సీఎం ప్రకటించిన పరిహారాన్ని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న బాధితులకు అందజేస్తున్నాం. ఐదు గ్రామాలనే గ్యాస్ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారని, ఫ్యాక్టరీ గోడ చుట్టూ ఉన్న గ్రామాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరారు. సీఎం ప్రకటించిన ప్రతి వ్యక్తికి రూ.10 వేలు ఇవ్వాలని కోరారు. వాటిని పరిశీలిస్తామని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. వాస్తవంగా ఇబ్బంది పడిన అందరినీ ఆదుకోవాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఆ గ్రామాలను కూడా పరిశీలిస్తున్నాం. రేపటితో ఎన్యుమరేషన్ పూర్తవుతుంది. ఐదు గ్రామాలతో పాటు ఏయే గ్రామాలకు సాయం అందించాలనే నివేదిక పూర్తవుతుంది. మంత్రులు, అధికారులు పరిశీలించిన తరువాత ప్రకటించడం జరుగుతంది. వారందరికీ రేపు సాయంత్రం, ఎల్లుండి లోపు వారందరికీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా సాయం అందించడం జరుగుతంది.
గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో భోజన సదుపాయం కల్పిస్తుంది. ఇంకా రెండ్రోజుల పాటు కొనసాగుతుంది. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు. దూరదృష్టితో ఆలోచన చేసి ఆదుకోవాలని ప్రభుత్వం చేస్తోంది. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించి దీర్ఘకాలికమైన ప్రణాళిక కూడా రూపొందించి.. రాబోయే రోజుల్లో కూడా ఏ విధమైన ఆరోగ్య సమస్య వచ్చినా పూర్తిగా బాధ్యత వహించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం.
ప్రతిపక్ష నాయకులు, పార్టీలు, వారికి వత్తాసు పలుకుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, చానళ్లు ఎప్పటిలాగే వారి రాతలు వారు రాస్తున్నారు. అది వారి ఖర్మ, మనం వారి మనసును మార్చలేం. వాస్తవాలు వక్రీకరించడమే వారి పనిగా పెట్టుకున్నాయి.
లోకో పైలెట్, కో పైలెట్ ఇద్దరూ అస్వస్థతకు గురైంది తెల్లవారితే శుక్రవారం అనగా జరిగితే.. ఈనాడు పత్రికలో శనివారం జరిగిందని ఆదివారం పత్రికలో రాశారు. అంటే రెండ్రోజుల తరువాత కూడా విశాఖలో విషవాయువులు ఉన్నాయని, అందరూ ఆందోళన చెందుతున్నారని ప్రజల భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పాను. తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు.. జూమ్ పార్టీ అయిపోయింది. ప్రజల దగ్గరకు రారు.. ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లరు. కరోనా వచ్చిన ప్రాంతాల ప్రజలకు సాయపడరు కానీ, జూమ్ యాప్లో విమర్శించుకుంటూ జూమ్ పార్టీగా తయారైంది. చంద్రబాబు వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించాడు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బా«ధాకరం. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే ఒకపక్క దోచుకుంటూ.. మరోపక్క గొప్పగా పబ్లిసిటీ ఇచ్చుకునేవాడు. చంద్రబాబు లేకపోతే ఏదో జరిగిపోయేది అన్నట్లుగా బిల్డప్లు ఇచ్చేవారు.
సీఎం వైయస్ జగన్ చక్కగా.. క్షుణ్ణంగా.. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అధికారులకు సలహాలు, సూచనలు ఇస్తూ.. ఎవరి పని వారు చేసుకునే విధంగా స్వేచ్ఛ కల్పించారు. సీఎం చొరవతోనే 5 రోజుల్లో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చాం. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే విష వాయువు లీకేజీ సమస్య సర్థుమనిగేందుకు 50 రోజులు పట్టేది.
కరోనాతో మనం కలిసి బతకాల్సిందేనని మొదటి రోజు నుంచి సీఎం వైయస్ జగన్ చెప్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ, ఇవాళ మన దేశ ప్రధాని కూడా కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందేనని చెబుతున్నారు. సీఎం వైయస్ జగన్ ఏది మాట్లాడినా అది తప్పుగా చూపించి రాజకీయ లబ్ధిపొందాలని ఆలోచన తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. ఎవరైనా స్లిప్ ఇస్తే అది చదివేయడం చంద్రబాబు అలవాటు.. కానీ, సీఎం వైయస్ జగన్ అలా కాదు.. ఏదైనా విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాతే నోరు విప్పి మాట్లాడుతారు.