విశాఖ: లాక్డౌన్లో పేదల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం వైయస్ జగన్ పిలుపు మేరకు స్వచ్ఛంద సేవా సంస్థలు పేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నాయన్నారు. 7500 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విశాఖలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం వైయస్ జగన్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ. వెయ్యి ఆర్థిక సాయం అందించారన్నారు. అంతేకాకుండా ఉచిత రేషన్తో పాటు, కిలో కందిపప్పు అందిస్తున్నామన్నారు. అదే విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా కరోనా నియంత్రించగలమని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
ప్రగతి ఫౌండేషన్ సేవలు అభినందనీయం: మంత్రి అవంతి
పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచిన ప్రగతి భారత్ ఫౌండేషన్ను అభినందిస్తున్నానని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీఎం వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి చెప్పారు.