తాడేపల్లి: ఐదేళ్ల టీడీపీ పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అమరావతి ప్రాంతంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణమీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేకపోయారన్నారు.ఐదేళ్లలో ఐదు శాతం పనులు కూడా చేయలేకపోయారని మండిపడ్డారు. చంద్రబాబు బాధంతా తన బినామీల కోసమే అన్నారు. చంద్రబాబు ఏపీలో ఉంటూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. పంచభూతాలను దోచుకుని ఏదో జరిగినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి లక్షన్నర కోట్లు అంచనా వేసి ఐదు వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. సచివాలయానికి చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి తాత్కాలికంగా ఉన్నారని గుర్తు చేశారు.పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం కమ్యూనిస్టు పార్టీలకు కూడా ఇష్టం లేదా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలు టీడీపీని ఎందుకు ప్రశ్నించడం లేదని బొత్స సత్యనారాయణ నిలదీశారు.