తాడేపల్లి: అమరావతి రైతులెవరూ కూడా అధైర్యపడొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. సీఎం వైయస్ జగన్తో హై పవర్ కమిటీ భేటీ ముగిసింది. సీఎం వైయస్ జగన్కు కమిటీ సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..సీఎం సమక్షంలో హైపవర్ కమిటీ సభ్యులమంతా కలిశాం. హైపవర్ కమిటీ సమావేశాల వివరాలు సీఎంకు వివరించాం. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు కలిపి చర్చించాం. సమగ్ర ప్రణాళికతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. కమిటీ నివేదికను కేబినెట్ ముందు ఉంచుతాం. కేబినెట్ భేటీలో సీఎంకు అన్ని విషయాలు చెబుతాం. రైతుల సమస్య సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. రైతులకు మరింత లబ్ధి కలిగేలా సీఎం సూచనలు చేశారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం. అన్ని వర్గాలు బాగుపడాలన్నదే మా తాపత్రయం. సీఆర్డీఏ రద్దు అనేది మా దృష్టికి రాలేదు. సీఆర్డీఏ మెయిల్ పని చేయడం లేదనేది అవాస్తవం. చెన్నై ఐఐటీ ఇచ్చిన నివేదిక ఏమిటో నాకు తెలియదు. అమరావతిలో నిర్మాణాల్లో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తాం. అమరావతిలో నిర్మించిన అన్ని భవనాలు ఉపయోగించుకుంటాం. అమరావతి రైతులు చంద్రబాబు మాయలో పడొద్దు. వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు మోసం చేస్తున్నారు. మేము రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం. ఐదేళ్లలో అమరావతిపై నోటిఫికేషన్ ఇచ్చారా? అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. రైతాంగానికి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బ్రాండ్ అంబాసిడర్.. ఆయన వారసత్వంలో అదేబాటలో నడుస్తున్న ప్రభుత్వం మాది.అమరావతి రైతులెవరూ అధైర్యపడొద్దు. రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 13 జిల్లాలతో పాటు అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.