అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగిస్తాం

23 Sep, 2019 11:54 IST

అమరావతి: సీఆర్‌డీఏ పరిధిలని అన్ని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి బొత్స మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణానదిలో అక్రమ నిర్మాణాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కరకట్టలోపల ఉన్న అక్రమ నిర్మాణాలకు గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నారంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇల్లు అక్రమ నిర్మాణమేనని గతంలో చందరబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు. ఆ రోజు ల్యాండ్‌ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇచ్చారని అంగీకరించారన్నారు. ఇప్పుడేమో దానిపై చంద్రబాబు మాట మారుస్తున్నారన్నారు. కోర్టు సూచనలతోనే ఇప్పుడు చర్యలు తీసుకుంటామని, పాతూరి కోటేశ్వరరావు భవనంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని మంత్రి వివరించారు. లింగమనేని ఇంటికి కూడా నోటీసులు ఇచ్చామన్నారు. చట్ట ప్రకారం అన్ని అక్రమ కట్టడాలను తొలగిస్తామన్నారు.